Friday, November 20, 2015

14, జూన్ 2011, మంగళవారం

Tuesday, November 2, 2010

బ్రెజిల్‌ అధ్యక్షురాలు దిల్మా రౌస్సెఫ్‌

6 శాతం ఓట్లతో విజయం
బ్రెజిల్‌లో 2010 అక్టోబర్‌ 31 జరిగిన రెండవ విడత అధ్యక్ష ఎన్నికల్లో పాలకపక్ష అభ్యర్థి దిల్మా రౌస్సెఫ్‌ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు అధికారిక ఫలితాలు తెలిపాయి. ఆమె మహిళా ఆర్థికవేత్త. బ్రెజిల్‌ సైనిక నిరంకుశత్వ పాలనా కాలంలో ఒకసారి ఆమె గెరిల్లాగా కూడా శిక్షణ పొందారు. మొత్తం లెక్కింపు పూర్తయిన అనంతరం చెల్లుబాటైన ఓట్లలో ఆమెకు 56 శాతం లభించాయి. ఆమె ప్రత్యర్థి, సోషల్‌ డెమోక్రాట్‌ అభ్యర్థి జోస్‌ సెర్రాకు 44 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్టోబర్‌ 31న సాయంత్రం ఆయన తన ఓటమిని అంగీకరించారు. వర్కర్స్‌ పార్టీ అభ్యర్థిగా ఆమెను ప్రస్తుత అధ్యక్షుడు లూలా నామినేట్‌ చేశారు. దీంతో లూలా విధానాల కొనసాగింపుకు వీలు ఏర్పడింది. 'ఆయన స్థానాన్ని ఆక్రమించడమనే లక్ష్యం చాలా కష్టమైనది, సవాలుతో కూడుకున్నది. అయితే ఆయన వారసత్వాన్ని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. ఆయన కృషిని, నిర్మాణాన్ని ఎలా పటిష్టపరచాలో కూడా తెలుసు' అని అధ్యక్షురాలిగా ఎన్నికైన అనంతరం చేసిన తొలి ప్రసంగంలో రౌస్సెఫ్‌ ఆనందబాష్పాల మధ్య చెప్పారు. ఫలితాల తుది ధ్రువీకరణ అనంతరం వచ్చే జనవరి 1న ఆమె నాలుగు సంవత్సరాల కాలానికి అధ్యక్ష పదవిని చేపడతారు. వర్కర్స్‌ పార్టీకి పార్లమెంటు ఉభయసభల్లోనూ మెజారిటీ ఉంది. పేదరికాన్ని నిర్మూలించడం, అందరికీ సమాన అవకాశాలు సృష్టించడమనేవి తన ప్రాథమిక వాగ్దానమని ఆమె చెప్పారు. ఆర్థికాభివృద్ధిని, ధనిక దేశాల రక్షణాత్మక విధానాలపై పోరును, ఆర్థిక స్పెక్యులేషన్‌ను అంతంచేయాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. తొలి విడత ఎన్నికల్లో ఆమెకు 47 శాతం ఓట్లు లభించాయి. అయితే అవసరమైన 50 శాతానికి పైగా ఓట్ల కోసం రెండవ విడత ఎన్నికలు జరిపారు. 13.6 కోట్ల మంది ఓటర్లు రిజిష్టరు కాగా 21 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన లేదు. కాగా బ్రెజిల్‌లో వయోజనులు ఓటు వేయడం తప్పనిసరి. పోలింగ్‌ కేంద్రాలను ఉదయం పది గంటలకు తెరిచారు. తొమ్మిది గంటల అనంతరం పోలింగ్‌ ముగిసింది. అయితే కొన్ని అమెజాన్‌ రాష్ట్రాల్లో మాత్రం రాత్రి 9 గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించినందున ఓట్ల లెక్కింపు వేగంగా జరిగింది. ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా జరిగినట్లు అత్యున్నత ఎన్నికల ట్రిబ్యునల్‌ తెలిపింది. ఆమె దేశానికి గొప్ప ప్రభుత్వాన్ని అందిస్తారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని లూలా తన స్వస్థలం సావో బెర్నార్డో దూ క్యాంప్‌లో ఓటు వేసిన అనంతరం చెప్పారు. లూలాకు ప్రజల్లో 80 శాతం రేటింగ్‌ ఉంది. అయితే రౌస్సెఫ్‌ ప్రభుత్వంలో తాను ప్రత్యక్షంగా జోక్యం చేసుకోబోనని లూలా చెప్పారు.
బ్రెజిల్‌ గురించి
బ్రెజిల్‌ అధికార నామం ఫెడరిక్‌ రిపబ్లిక్‌ ఆప్‌ బ్రెజిల్‌ దక్షణ అమెరికాలో ఒక దేశమిది. వైశాల్య రిత్యా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద దేశం బ్రెజిల్‌. నాల్గవ అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఉంది. తూర్పున అట్లాంటిక్‌ మహాసముద్రం ఉన్న బ్రెజిల్‌ సముద్రతీరం పొడవు 7.491 కిలోమీటర్లపై బడి ఉంది. 1500 సంవ్సతరం నుంచి 1822లో స్వాతంత్య్రం పొందే వరకు బ్రెజిల్‌ పోర్చుగల్‌ పరిపాలనలో ఉంది. బ్రెజిల్‌ ఐక్యరాజ్య సమితి స్థాపన దేశాలలో ఒకటి.

Saturday, October 30, 2010

ఆకట్టుకున్న తెలుగు తొలి జంట కవయిత్రుల అష్టావధానం

ఆకట్టుకున్న తెలుగు తొలి జంట కవయిత్రుల అష్టావధానం


తెలుగు తొలి జంట కవయిత్రులు టి. ఉదయచంద్రిక , బి.అపర్ణల అష్టావధానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రముఖ సాహితీవేత్త తోపుదుర్తి వెంకట్రామయ్య ప్రోత్సాహంతో ఆదివారం తెలుగు లలితకళాసమితీలో డాక్టర్‌ ఆశావాది అధ్యక్షతన ఈ అష్టావధానం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 24 సార్లు అవధానం చేసిన ఈ జంట కవయిత్రులు ధూలిపాల మహదేవమణితో శిక్షణ పొందారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఉదయచంద్రిక, రాజమండ్రికి చెందిన అపర్ణ అవధాన కళను సాహితీలోకానికి తెలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవధాన ప్రక్రియ ఒక్క తెలుగు భాషలోనే ఉన్నప్పటికీ దానికి అంత ఆదరణ లేదని, తెలుగు ప్రజలకు అవగాహన కల్పించి ఆదరణ పెంచుతామని తెలిపారు. ఫృశ్చకులు ఇచ్చిన సమస్యలను పూరించి చక్కటి ధారనా పటిమతో అవధానాన్ని రక్తి కట్టించారు. ఫృచ్చకులతోపాటు , సభకు హాజరయిన కవి పండితులు ప్రశంసించారు.
ఈ అవధానంలో ఫృశ్చకులుగా నిశిద్ధాక్షరి -డాక్టర్‌ మహ్మద్‌హుస్సేన్‌, సమస్య -నారాయణ స్వామి , దత్తపది -వైద్యం వెంకటేశ్వర్లు, వర్ణన -పద్మావతమ్మ, న్వస్తాక్షరి-పార్వతీదేవి, వారగణనం -తోపుదుర్తి వెంకట్రామయ్య, అప్రస్తుత ప్రసంగం -రామచంద్ర , గంటానాధం తెలకపల్లి పాండురంగశర్మ పాల్గొన్నారు.
పద్యకవితలో శిక్షణ అవసరం : ఆశావాది
తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవడానికి ప్రధానంగా పద్యకవితలో ఔత్సాహికులకు శిక్షణ అవసరమని ప్రముఖ అష్టావధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు సూచించారు. కర్నూలు జిల్లాలో అనేక సాహితీ సంస్థలున్నాయని వారు పుస్తకావిష్కరణ సభలు, కవిసమ్మేళనాలకే పరిమితం కాకుండా పద్యకవితమై శిక్షణా తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చక్కటి అవధానం చేసిన ఉదయచంద్రిక, అపర్ణలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభినందించారు. చిన్నపాటి లోపాలను సరిచేసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. అవధానంలో పూరించిన చక్కటి పద్యాలివి
నిశిద్ధాక్షరి పద్యం : -
శ్రీకిన్‌ ధీకిన్‌ నీవే
వాకున్‌ జేతుల్‌ సతంభు వాణీ నీవే
గాకర్త వింక దయతో
మాకై తలనిండియుండి మాతా గనుమా!
సమస్యాపూరణ పద్యం: -
నీవా ఇంటికి దేవతై వెలుగుచున్‌ నీరాజనంబందుచున్‌
జీవంబౌచు ప్రజాంతరంగములకున్‌ జేజేలనేబొందుచున్‌
కావేనీవు జనాలహార్టుబీటువు గదా కల్లోలమున్‌ చేసే ఓ
'' టీవీ ఎంతటి జానవైతివిగదే టీనేజి కుర్రోళ్లకున్‌ ''
దత్తపది :'' చెప్పు, చేట, పేడ, గాడిద '' పదాలతో ( అల్లసాని పెద్దనను శ్రీకృష్ణదేవరాయల సత్కారం తో పద్యం)
కైతల రేడు చెప్పు ఘన కావ్యసుధన్‌గని కృష్ణరాయలే
ఏతరి సల్పెనన్నమును పేడను చూడని రీతిలో భువిలో
నూతనమైనగాడిదను నోటబల్కగ రాజ్యమంతయున్‌
మ్రోతల చేటపాసులన్‌ ముచ్చటజేసె పెద్దనార్యుకున్‌
వర్ణన:-
ఇంతికి నర్థభాగమిడి ఈశ్వరుడొందెన్‌ లోకమాన్యతన్‌
ఎంతనిజెప్ప బూనినను ఏరికిసాధ్యముమాన్యతో శంకరుడహో
వింతగు లీలల న్నిటిని వేవుపాడగ భక్తకోటిమీ
చెంతను చేరి మ్రొక్కినను చింతలు చేరవుమానసంబునన్‌

న్యస్తాక్షరి : నవరాత్రి వచ్చేట్లుగా వృత్త పద్యం
నావరణీయ భావమున నర్తనమాడగ తల్లిరో సదా
సేవలు చేయు భాగ్యమిక తెన్నుగ భక్తుల కీయ వేడెదన్‌
కావగమమ్ము రాదె కామ్యములీయగ శంకరాకృపన్‌
ప్రోవగ కృష్టజాలమిది బ్రోచుతో మమ్ముసుగాత్రీ వేడెదన్‌.

పై పద్యాలన్నింటినీ చక్కటి ధారణతో సభికులకు వినిపించారు.

భగవద్గీత ఆవిర్భావం

భగవద్గీత
GitaUpadeshTirumala.jpg
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

భగవద్గీత విశిష్టత

భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
  • శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
  • ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవిపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
  • నేను గీతను ఆశ్రయించి ఉందును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
  • నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)

భగవద్గీతలో ముఖ్య విషయాలు

గీతా సారము
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.

ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.

కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.

ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.

శ్రీకృష్ణుడు,పార్థుడు గీతోపదేశం సన్నివేశం ఉన్న విగ్రహాలు తిరుమలలో
ఆత్మ తత్వము

జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి

యోగ సాధన

భగవత్తత్వము

శ్రద్ధ, గుణ విభాగము

భగవద్గీత విభాగాలు

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. (ఆధ్యాయం శీర్షిక లేత నీలి రంగులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే వికీసోర్స్‌లోని ఆ అధ్యాయానికి దారి తీస్తుంది)

అర్జునవిషాద యోగము

"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.

సాంఖ్య యోగము

సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.

కర్మ యోగము

కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన
  1. యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.
  2. కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
  3. లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.

జ్ఞాన యోగము

ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రదము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -

" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."

కర్మసన్యాస యోగము

ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"

ఆత్మసంయమ యోగము

ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.

జ్ఞానవిజ్ఞాన యోగము

విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.

భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.

ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.

అక్షరపరబ్రహ్మ యోగము

బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.

క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.

రాజవిద్యారాజగుహ్య యోగము

కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -
" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."

"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"

విభూతి యోగము

ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.

" నేను సమస్త ప్రాణుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. ,

విశ్వరూపసందర్శన యోగము

శ్రీకృష్ణుడు విశ్వరూపములలో
భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.

"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.

అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.

భక్తి యోగము

పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.

ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.

గుణత్రయవిభాగ యోగము

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.

సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.

పురుషోత్తమప్రాప్తి యోగము

త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.

దైవాసురసంపద్విభాగ యోగము

అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను.

శ్రద్దాత్రయవిభాగ యోగము

వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?

మోక్షసన్యాస యోగము

కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.